ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
జగ్గయ్యపేట,మార్చి26, (వెలుగు నాడు ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ,గుంటూరు జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్త ఆధ్వర్యంలో పిడుగురాళ్ల ప్రాంత రైతులకు గరికపాడులోని కృషి విజ్ఞాన కేంద్రంలో క్షేత్రస్థాయి పరిశీలన,ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా 'ఆత్మ' సంస్థ ఆర్థిక సహకారం అందించింది. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త,అధిపతి డాక్టర్ ఎమ్ వి కిషోర్ రైతులకు సాదర స్వాగతం పలికి, విధులు, బాధ్యతలు,రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న వివిధ సాంకేతిక సేవల గురించి వివరించారు.అనంతరం సస్యరక్షణ విభాగ నిపుణులు డాక్టర్ ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు, పత్తిలో గులాబీ రంగు పురుగు,అధిక దిగుబడి కోసం పత్తి సాగులో దగ్గరగా మొక్కలు నాటే పద్ధతిపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.మరో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి కేంద్రంలోని వివిధ ప్రదర్శన క్షేత్రాలను రైతులకు చూపిస్తూ, వాటి పనితీరును వివరించారు. అదేవిధంగా మిరప పంటను ఆశించే తామర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు ప్రత్యక్షంగా వివరించారు.ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల సహాయ వ్యవసాయ సంచాలకులు బి శ్రీకృష్ణ దేవరాయలు, రాజుపాలెం మండల వ్యవసాయ అధికారి ప్రతినిధి పి వెంకట నరసయ్య, నకిరేకల్ మండల వ్యవసాయ అధికారి కె దేవా దాస్, దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.పిడుగురాళ్ల, మాదిపాడు,కోసూరు మండలాల నుండి వచ్చిన రైతులు ఈ శిక్షణలో పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0